AADHAAR VOTER CARD SEEDING
ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానం - ఆర్టికల్ 326కు లోబడే: ఈసీ.
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం- త్వరలోనే ఈసీ, యూఐడీఏఐ నిపుణుల సంప్రదింపులు.
Aadhaar Voter Card Seeding : ఆధార్ కార్డులతో ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధానించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆధార్తో ఓటరు ఐడీలను అనుసంధానిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై త్వరలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI), ఈసీలకు చెందిన నిపుణులు సంప్రదింపులు జరుపుతారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ (మంగళవారం) ఈసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, ఐటీ శాఖల కార్యదర్శులు, యూఐడీఏఐ సీఈఓ పాల్గొన్నారు.
"రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు భారత పౌరులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి ఉనికిని నిర్ధరించడానికి ఆధార్ ప్రాతిపదికగా నిలుస్తుంది. అందుకే మేం ఓటరు ఐడీని ఆధార్తో లింక్ చేస్తున్నాం. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 23(4), 23(5), 23(6) సెక్షన్ల ప్రకారం, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే మేం ఈ ప్రక్రియను చేపడుతున్నాం" అని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.
అది స్వచ్ఛందమే!
ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటరు ఐడీతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. ఆధార్-ఓటర్ ఐడీల అనుసంధానాన్ని పూర్తి చేయడానికి నిర్దిష్ట గడువేదీ లేదని ఇప్పటికే పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యం మాత్రమే తమకు ఉందని పేర్కొంది. ఓటరు ఐడీతో ఆధార్ను లింక్ చేసుకోని వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం -1950లోని సెక్షన్ 23ని 2021 ఎన్నికల చట్టాల సవరణ చట్టం ద్వారా సవరించారు. దీని ప్రకారం, "ఒక భారత పౌరుడి ఓటరు గుర్తింపును నిర్ధరించేందుకు, ఆధార్ కార్డును స్వచ్ఛందంగా చూపించమని అతడిని అడిగే అధికారం ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులకు ఉంటుంది".