Gold in tons, Kurnool Gold Mine started..
టన్నుల్లో బంగారం, కర్నూలు గోల్డ్ మైన్ ప్రారంభం.. ఏపీలో బంగారం రేటు తగ్గిద్దా..!
AP Gold Mines: ఏపీలో కొన్ని నెలల కిందట బంగారం గనులను గుర్తించటం జరిగింది. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో మెుదటి ప్రైవేటు గోల్డ్ ప్రాసెసింగ్ ప్రాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం రేపు అంటే ఫిబ్రవరి 18న ప్రజాభిప్రాయసేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్ల కిందట పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన జియోమైసోర్, డెక్కన్ గోల్డ్మైన్స్ లిమిటెడ్ చివరకు ప్లాంట్ నుంచి వాణిజ్య కార్యకలాపాలకు ప్రారంభించాలని నిర్ణయించటంతో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ముందుగా ఫిబ్రవరి 2023లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబడగా.. 20 టన్నుల మట్టిని ప్రాసెసింగ్ చేసినప్పుడు దాదాపు 40-50 గ్రాముల వరకు పసిడిని గుర్తించారు. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో దాదాపు 750 కేజీల బంగారం వార్షికంగా ప్రాసెసింగ్ చేయవచ్చని తెలుస్తోంది.
వాస్తవానికి రెండు దశాబ్థాల కిందట 1994లో కర్నూలు జిల్లా గోల్డ్ నిల్వలు ఉన్నట్లుగా తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించటం జరిగింది. అయితే దీనిని ముందుకు తీసుకెళ్లటానికి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించటం జరిగింది. దీని తర్వాత కేంద్రం 2005లో ఓపెన్ లైసెన్సింగ్ విధానంతో మైనింగ్ లీజు ప్రక్రియను సరళీకరించింది. విదేశీ పెట్టుబడులతో సహా ప్రైవేట్ డెవలపర్ల కోసం మరోసారి అన్వేషణ మెుదలైంది. ప్రస్తుతం దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణంలో పసిడి మైనింగ్ కోసం అనుమతులు లభించాయి. జియోఫిజిసిస్ట్ డాక్టర్ మొదలి హనుమ ప్రసాద్ నేతృత్వంలోని బెంగళూరుకు చెందిన జియోమైసోర్ సర్వీసెస్ లిమిటెడ్ 2013లో జొన్నగిరి మండలంలో బంగారం అన్వేషణ కోసం ట్రయల్స్ ప్రారంభించడానికి ప్రాథమిక లైసెన్స్ను పొందింది. పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా అన్ని అనుమతులు పొందడానికి సంస్థకు ఒక దశాబ్దం పట్టింది. ఇంత ఆలస్యం తర్వాత 2021లో బంగారు మైనింగ్ ట్రయల్స్ను ప్రారంభించింది.
డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ జియోమైసోర్లో దాదాపు 40 శాతం వాటాను కొనుగోలు చేసి అన్వేషణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 30 వేల బోర్ వెల్లతో ట్రయల్స్ నిర్వహించటం జరిగింది. ఇంత సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కంపెనీ డిసెంబర్ 2024లో తమ వాణిజ్య కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించాలని మెుదట లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అయితే ల్యాబ్ నివేదికల పెండింగ్ కారణంగా ఇది ఇంకాస్త జాప్యానికి దారితీసింది. జోన్నగిరిలో దాదాపు రూ.320 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా సంస్థ పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ యంత్రాలను ఏర్పాటు చేసిందని కూడా వెల్లడైంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాత ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా వాస్తవ అన్వేషణకు వెళ్లాలని కంపెనీ నిర్ణయించింది. జొన్నగిరిలో దాదాపు 25 ఏళ్ల పాటు మైనింగ్ ప్రక్రియను కొనసాగించాలని ఇప్పటికే కంపెనీ ప్లాన్ చేసుకుంది. అయితే ఈ చర్యల వల్ల ఏపీలో పసిడి ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.